Wednesday, September 18, 2024

మోడీ, యోగిని పొగిడినందుకు భార్యకు ట్రిపుల్ తలాఖ్

- Advertisement -
- Advertisement -

లక్నో: అయోధ్యలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పొగిడినందుకు తన భర్త తనకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్‌కు చెందిన ఒక ముస్లిం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తన భర్తతోపాటు అత్త, ఇతర బంధువులు తనను కొట్టారని, తన గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారని కూడా ఆ మహిళ ఆరోపించింది.

బహరాయిచ్‌లోని మొహల్లా సరాయ్‌లో నివసించే ఒక మహిళకు 2023 డిసెంబర్ 13న అయోధ్యలో నివసించే అర్షద్‌తో వివాహమైందని బహరాయిచ్‌లోని జార్వాల్ రోడ్డు పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌హెచ్‌ఓ) బ్రిజ్‌రాజ్ ప్రసాద్ శనివారం తెలిపారు. వివామైన తర్వాత మొదటిసారి అయోధ్యకు వెళ్లిన ఆ మహిళకు అక్కడి రోడ్లు, నగర సుందీరీకరణ, అభివృద్ధి, వాతావరణం బాగా నచ్చాయని, దీంతో ఆమె తన భర్త సమక్షంలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోడీని పొగిడారని ఆయన తెలిపారు. ఆ పొగడ్తలను తట్టుకోలేకపోయిన ఆమె భర్త పప్పు ఉడుకుతున్న వేడి ప్యాన్‌ను ఆమెపైన విసిరాడని, అంతేగాక ఆమెను వెంటనే ఆమెను ఆమె పుట్టింటికి పంపించివేశాడని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. కొద్ది రోజుల తర్వాత భర్త తాలూకు బంధువులు బహరాయిచ్‌కు వెళ్లి ఆమె తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను ఆయోధ్యకు తీసుకువచ్చారని ఆయన చెప్పారు.

అయితే.. తన భార్యపై కోపం తగ్గని ఆమె భర్త ముఖ్యమంత్రిని, ప్రధానిని ఆమె ముందే దూషించి ఆమెకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాడని ఆయన తెలిపారు. విడాకులు ఇచ్చిన రోజున తన భర్త తనను కొట్టాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఆమెభర్త అర్షద్‌తోపాటు అత్త, మామ, ఇద్దరు మరదళ్లు, మరిదితోసహా 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News