Saturday, September 14, 2024

భర్తకు దగ్గరుండి మరీ మరో పెళ్లి చేసిన భార్య

- Advertisement -
- Advertisement -

ఓ మహిళ తన భర్తకు దగ్గరుండి మరో యువతితో పెళ్లి చేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. బంధువులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం. మహబూబాబాద్‌కు చెందిన సురేష్, సరిత దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే, సురేష్‌కు ఓ మేనమామ ఉన్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురికి ఇప్పటికే వివాహం జరగ్గా చిన్న కూతురు సంధ్య ఓ మానసిక వికలాంగురాలు. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. ఈ క్రమంలో తమ తర్వాత ఆమె పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సంధ్య గురించి పూర్తిగా తెలిసి అర్థం చేసుకున్న వారే ఆమెను బాగా చూసుకుంటారని భావించారు .

ఈ క్రమంలో సంధ్య తల్లిదండ్రులు సురేష్ దంపతుల ముందు రెండో పెళ్లి ప్రతిపాదన పెట్టారు. సరితకు కూడా సంధ్య గురించి పూర్తిగా తెలుసు. ఆమెను చెల్లెలిగానే చూస్తూ వస్తోంది. మానసిక వికలాంగురాలైన సంధ్య సురేష్‌ను ఇష్టపడిందని తెలుసుకున్న సరిత వీరి పెళ్లికి అంగీకరించింది.ఈ క్రమంలో బుధవారం ఉదయం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయంలో బంధు మిత్రుల సమక్షంలో సురేష్, సంధ్యల వివాహం దగ్గరుండి మరీ జరిపించినట్లు బంధు మిత్రులు వెల్లడించారు. సురేష్ మొదటి భార్య సరిత మీడియాతో మాట్లాడుతూ సంధ్య తనకు చెల్లి వంటిదని, ఆమె బాగోగులు చూసుకోవడానికే ఈ పెళ్లికి అంగీకరించానని వివరించింది.

సంధ్య మానసిక వికలాంగురాలని, ఆమె బాగోగుల కోసమే ఈ పెళ్లి జరిపించామని స్పష్టం చేసింది. అందుకు కాక.. ఇంకెందుకు పెళ్లి చేస్తామని సరిత ఎదురు ప్రశ్నించింది. ఈ పెళ్లి అందరి ఇష్టపూర్వకంగా జరిగిందని వెల్లడించింది. ఇలాంటి ఘటనలు జరగడం అరుదుల్లోకెల్లా అరుదు. సంతానలేమీ వంటి బలమైన కారణాలు మినహా ఇలాంటి పెళ్లికి దంపతులు అంగీకరించరు. ఇక్కడ వీరంతా మానసిక వికలాంగురాలైన సంధ్య భవిష్యత్ గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాహం పట్ల మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News