- సొంత ప్రభుత్వంపై పాకిస్తాన్ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు
- పహల్గామ్ దాడి తరువాత భారత్ చర్యలపై పాక్ నేతల వ్యాఖ్యలు
- ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పాక్ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు
- నీళ్లు, గ్యాస్, ఆర్థిక దుస్థితిపై సెటైరికల్ మీమ్స్, జోకులు
ఇస్లామాబాద్: పహల్గామ్ ఉగ్ర దాడి అనంతరం భారత్ తీసుకుంటున్న కఠిన చర్యలు, సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేత వంటి నిర్ణయాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతుంటే, అక్కడి సామాన్య పౌరులు మాత్రం తమ ప్రభుత్వంపైనే సోషల్ మీడియావేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దేశంలోని ఆర్థిక దుస్థితి, కనీస వసతుల కొరతను ఎత్తిచూపుతూ తమ అసంతృప్తిని, నిరాశను హాస్యం, మీమ్స్ రూపంలో వెళ్లగక్కుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీనికి ప్రతిగా భారత్ సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. దీనిపై పాక్ రక్షణ శాఖ మంత్రితో పాటు పలువురు నేతలు తీవ్రంగా స్పందించారు. సింధు నదిలో ప్రతి నీటి చుక్కా తమదేనని, నీళ్లు ఆపితే నదుల్లో రక్తం పారుతుందని వారు హెచ్చరించారు. అయితే, ఆ హెచ్చరికలపై పాక్ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘భారత్ నీళ్లు ఆపేస్తుందా? అసలు మాకు నీటి సరఫరానే సరిగ్గా లేదు’, ‘మమ్మల్ని చంపేస్తారా? మా ప్రభుత్వం మమ్మల్ని రోజూ చంపుతూనే ఉందిగ!’, ‘లాహోర్ తీసుకుంటారా? అరగంటలోనే అక్కడ ఏమీ లేదని మీరే తిరిగి ఇచ్చేస్తారు’ అంటూ కొందరు తమ ఆవేదనను వ్యంగ్యంగా వెలిబుచ్చారు. మరొక నెటిజన్ ఒక వ్యక్తి స్నానం చేస్తుండగా సబ్బు కళ్లలో పడి నీళ్లు ఆగిపోయిన ఫోటోను షేర్ చేస్తూ ‘భారత్ నీళ్లు వదులు’ అని రాసుకువచ్చాడు. పెరుగుతున్న ధరలు, గ్యాస్ కోతలను ఉద్దేశిస్తూ, ‘యుద్ధం చేయాలనుకుంటే రాత్రి తొమ్మిది లోపే ముగించండి, ఆ తరువాత గ్యాస్ సరఫరా ఉండదు’ అని కొందరు, ‘మేము పేద దేశంతో పోరాడుతున్నామని వారికి తెలియాలి’ అని మరి కొందరు వ్యాఖ్యానించారు. కాగితపు అట్టలతో ఫైటర్ జెట్లా తయారు చేసిన బైక్పై వెళుతున్న వ్యక్తి ఫోటోను పంచుకుంటూ పాక్ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ మీమ్స్, జోకులు పాకిస్తాన్లో నెలకొన్న క్షేత్ర స్థాయి పరిస్థితులకు, ప్రజల అసంతృప్తికి అద్దం పడుతున్నాయి.