Tuesday, September 17, 2024

తుది పోరుకు పాలిని

- Advertisement -
- Advertisement -

సెమీస్‌లో పోరాడి ఓడిన వెకిక్
వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ

లండన్: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో ఇటలీ సంచలనం, ఏడో సీడ్ జాస్‌మిన్ పాలని టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీఫైనల్లో జాస్‌మిన్ 26, 64, 76(10/8) తేడాతో క్రొయేషియాకు చెందిన డొనా వెకిక్‌ను ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఆరంభ సెట్‌లో వెకిక్ ఆధిపత్యం చెలాయించింది. దూకుడుగా ఆడుతూ జాస్‌మిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది.

కళ్లు చెదిరే షాట్లతో విరుచుకు పడిన వెకిక్ ఏ దశలోనూ జాస్‌మిన్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చెలరేగి ఆడిన వెకిక్ ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో కూడా వెకిక్ దూకుడుగా ఆడింది. అధ్భుత ఆటతో జాస్‌మిన్‌ను హడలెత్తించింది. కానీ జాస్‌మిన్ కూడా పట్టువదల లేదు. ఒత్తిడిన సయితం తట్టుకుంటూ ముందుకు సాగింది. కీలక సమయంలో చిరస్మరణీయ ఆటతో మళ్లీ మ్యాచ్‌పై పట్టు సాధించింది. వెకిక్ ఆధిపత్యాన్ని దీటుగా ఎదుర్కొంటూ లక్షం దిశగా అడుగులు వేసింది. ఇదే క్రమంలో నిలకడైన ఆటతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతేగాక అద్భుత ఆటతో సెట్‌ను సయితం దక్కించుకుంది.

ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు వెకిక్ అటు జాస్‌మిన్ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరు యుద్దాన్ని తలపించింది. ఇద్దరు పట్టువీడకుండా పోరాడారు. ఈ క్రమంలో సెట్ టైబ్రేకర్‌కు వెళ్లక తప్పలేదు. ఇందులో కూడా ఉత్కంఠత తప్పలేదు. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన జాస్‌మిన్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. రిబకినా (కజకిస్థాన్), క్రెజ్‌సికొవా (చెక్)ల మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ విజేతతో జాస్‌మిన్ ఫైనల్లో తలపడుతుంది. శనివారం ఈ పోరు జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News