Saturday, October 5, 2024

సిటీ బస్సులో ప్రసవం.. పురుడు పోసిన మహిళా కండక్టర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః హైదరాబాద్ నగరంలోని ఒక సిటీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి అదే బస్సులో మహిళా కండక్టర్, తోటి మహిళా ప్రయాణికుల సాయంతో పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. మానవత్వంతో, సమయస్ఫూర్తిగా వ్యవహరించి పురిటి నొప్పులతో ఉన్న గర్భిణీకి అండగా నిలిచి పురుడు పోసిన కండక్టర్ సరోజను ప్రతి ఒక్కరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌పురలో టీజీఎస్‌ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ముషీరాబాద్ డిపో కండక్టర్ సరోజ, తోటి మహిళా ప్రయాణికులతో కలిసి పురుడు పోశారు. ముషీరాబాద్ డిపోకు చెందిన 1 జడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్ వద్ద ఎక్కారు. ఆ ఆర్టీసీ బస్సు బహదూర్‌పురా వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి.

ఆ బస్సులో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ సరోజ చక్కటి సమయస్పూర్తితో వ్యవహరించి సాటి మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని పలువురు పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవా స్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం ప్రశంసనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టిజి ఆర్‌టిసి సజ్జనార్‌లు స్పందించి కండక్టర్ సరోజను అభినందించారు. తల్లీ బిడ్డకు సరైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేశారు. సామాజిక సేవలో ఆర్టీసీ సిబ్బంది ఉండటం ఎంతో అభినందనీయమని మంత్రి పొన్నం కితాబు ఇచ్చారు.

ఆర్టీసి బస్సులో ప్రసవం చేసిన సిబ్బందికి , మహిళా ప్రయాణికులకు అభినందనలు – అని మంత్రి పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్నార్ ‘ఎక్స్‘ వేదికగా స్పందించారు. మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారని కొనియాడారు. ‘టీజీఎస్‌ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్.సరోజ అప్రమత్తమై, మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. వారందరికీ నా అభినందనలు” అని- వీసీ సజ్జనార్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News