గాంధీనగర్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం (8న) గుజరాత్ నవ్సారి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్న మెగా కార్యక్రమంలో కేవలం మహిళా పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి ఒకరు ప్రకటించారు. దేశంలో ఈ విధంగా భద్రత ఏర్పాట్లు చేయడం ఇదే మొదటి సారి అవుతుందని ఆయన చెప్పారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్ పోలీసులు ఒక విశిష్ట చొరవ తీసుకుంటున్నారు. దేశ చరిత్రలో ప్రప్రథమంగా కేవలం మహిళా పోలీసులు ప్రధాని కార్యక్రమానికి పూర్తిగా భద్రత ఏర్పాట్లు చూస్తారు. నవ్సారి జిల్లాలోని వన్సీ బోర్సి గ్రామంలోని హెలిప్యాడ్లో ప్రధాని రాక నుంచి కార్యక్రమం వేదిక వరకు వారే భద్రత సమకూరుస్తారు’ అని గుజరాత్ హోమ్ శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి తెలియజేశారు.
మహిళా పోలీస్ సిబ్బందితో ఐపిఎస్ అధికారులు, కానిస్టేబుళ్లు కూడా ఉంటారని ఆయన తెలిపారు. గుజరాత్, కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలిలో శుక్రవారం నుంచి రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ శనివారం వన్సీ బోర్సి గ్రామంలో ‘లాఖ్పతి దీదీ సమ్మేళన్’లో ప్రసంగించనున్నారు. ‘2100 కానిస్టేబుళ్లు. 187 మంది సబ్ఇన్స్పెక్టర్లు, 61 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు, 16 మంది డిఎస్పిలు, ఐదుగురు ఎస్పిలు, ఇక పోలీస్ ఐజి, ఒక అదనపు డిజిపి ర్యాంక్ అధికాఇ సహా మొత్తం మహిళా పోలీస్ సిబ్బంది శనివారం భద్రత బాధ్యతలు నిర్వర్తిస్తారు’ అని మంత్రి తెలిపారు. సీనియర్ మహిళా ఐపిఎస్ అధికారి, రాష్ట్ర హోమ్ శాఖ కార్యదర్శి నిపుణ తొరవాణె భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని మంత్రి చెప్పారు.