Friday, September 20, 2024

స్కిల్ వర్సిటీకి రూ. 100 కోట్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని, యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో గురువారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు రూ.100 కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్కిల్ యూనివర్సిటీ లో భాగస్వామ్యం పంచుకోవాలని, యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన కోరారు. యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తమ కంపెనీల పేర్లను లేదా దాతల పేర్లను ఈ భవనాలకు పెట్టాలని అధికారులకు ఆయన సూచించారు. వీలైనంత వేగంగా తమ ఆలోచనలను ఆచరణలోకి తెచ్చామని, ఇకపై యూనివర్సిటీ బాధ్యతను బోర్డు ఛైర్మన్ మహీంద్రా ఆనంద్‌కు అప్పగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇక నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తా
ఈ రంగంలో అనుభవంతో పాటు ప్రత్యేక గుర్తింపు ఉన్న మహీంద్రా ఆనంద్ స్కిల్ యూనివర్సిటీకి తన బ్రాండ్ ఇమేజీని తీసుకువస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు. దాదాపు 200 ఎకరాల్లో స్పోర్ట్ యూనివర్సిటీ నెలకొల్పి 2028 ఒలింపిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావాలన్న లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణను అందిస్తామన్నారు. ఈ యూనివర్సిటీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు సిఎం పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల ఇబ్బంది లేదని, రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌లో వెయ్యి కోట్లు ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఆర్థిక సహకారానికి మించి, రాష్ట్రంలోని అందరూ పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్యవేత్తలు ఆశించినంత చొరవ ప్రదర్శించాలని తగిన భాగస్వామ్యం, బాధ్యతలను పంచుకోవాలని ఆయన కోరారు.

పరిశ్రమల అవసరాలకు సరిపడా మానవ వనరుల కొరత ఉంది
స్కిల్ యూనివర్సిటీ చేయాలన్న తన ఆలోచనలతో పాటు భవిష్యత్ ఆకాంక్షలను ఆయన యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో పంచుకున్నారు. డిగ్రీలు, పీజీ పట్టాలు ఉంటే సరిపోదని, ఇంజనీరింగ్ పూర్తి చేసిన లక్షలాది మంది యువకులు ఒక ఉద్యోగం ఇప్పించాలని తన వద్దకు వస్తున్నారని ముఖ్యమంత్రి తనకు ఎదురైన కొన్ని అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఏటేటా లక్షలాది మంది యువకులు డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారని కానీ, అందరూ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని ఆయన అన్నారు. మరోవైపు పరిశ్రమల అవసరాలకు సరిపడా మానవ వనరుల కొరత ఉందన్నారు. ఈ అంతరాన్ని తొలిగించేందుకు స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పాలన్న ఆలోచన చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అందరికీ సరిపడా ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవని, వివిధ రంగాలతో పాటు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటే యువత ఉపాధికి ఢోకా ఉండదని ఆయన చెప్పారు.

అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం: మంత్రి శ్రీధర్‌బాబు
ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పారిశ్రామికవేత్తలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఆకర్షణీయ గమ్య స్థానంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఫ్యూచర్ సిటీని నెలకొల్పుతున్నామని, ఇప్పటికే అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి స్వీయ ఆలోచనతో త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ లో కొత్త కోర్సులు ప్రారంభమవ్వటం ఆనందంగా ఉందన్నారు.

తెలంగాణకు సత్తా ఉంది: ఆనంద్ మహీంద్రా
తెలంగాణకు సత్తా ఉందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. తెలంగాణలో నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. మంచి విజన్ ఉన్న సమర్థ నాయకుడు సిఎం రేవంత్ రెడ్డి అంటూ కొనియాడారు. అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్‌గా ఉండాలని సిఎం కోరగానే ఒప్పుకోవాల్సి వచ్చిందని ఆనంద్ మహీంద్రా అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు సబ్సిడీలు, ఆకర్షణీయ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాయని, కానీ, యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆలోచించిన తీరులోనే దార్శనికత ఉందని ఉందని ఆయన అభినందించారు. తెలంగాణలోనే అతి పెద్ద యూఎస్ కాన్సులేట్ ఉందని, ఎక్కువ మంది ఇక్కడి నుంచే అమెరికాకు వెళుతున్నారని ఆయన గుర్తు చేశారు. అలాంటప్పుడు ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించే గమ్యస్థానంగా తెలంగాణ నిలబడుతుందనడంలో సందేహం లేదన్నారు. ముఖ్యమంత్రి కల నిజం కావాలని, ఆయన ఆశయం నెరవేరాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

వచ్చే నెల నుంచే కోర్సులు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని యూనివర్సిటీ బోర్డు నిర్ణయించింది. దసరా పండుగ తర్వాత అక్టోబర్ నెలలో కోర్సులను ప్రారంభించనున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించింది. కానీ, ఈ ఏడాది తాత్కాలికంగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా లేక న్యాక్ లేదా నిథమ్‌లో ఈ వర్సిటీని నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ముందుగా హెల్త్ కేర్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ కోర్సులను ప్రారంభించనుంది. ఈ కోర్సుల నిర్వహణకు అపోలోతో పాటు ఏఐజీ, లెన్స్ కార్ట్, ఫ్లిఫ్ కార్ట్, అమెజాన్, అల్కార్గో, ప్రొ కనెక్ట్, ఓ9 సొల్యూషన్స్ కంపెనీలు ముందుకొచ్చాయి.

తొలి ఏడాది రెండు వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్ శ్రీనిరాజు, బోర్డు సభ్యులు పి.దేవయ్య, సుచిత్రా ఎల్లా, సతీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సిఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సిఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బోర్డు సభ్యులు మనీష్ సభర్వాల్, సంజీవ్ బిక్చందానీ, ఎంఎం మురుగప్పన్, డాక్టర్ కెపి కృష్ణన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశంలో ఎపి సిఎం కోడలు
ఎపి సిఎం చంద్రబాబు కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే, నారా బ్రహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.అయితే, తెలంగాణలో ఏర్పాటు చేయబోయే స్కిల్ యూనివర్సిటీలో భాగంగా ఆమె చర్చల్లో పాల్గొనడం ఆసక్తిగా మారింది. కాగా, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈ ఏడాది దసరా నుంచి ఆరు కోర్సులతో తరగతులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద 57 ఎకరాల స్థలంలో స్కిల్ వర్సిటీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News