తనను ప్రేమించడం లేదని ఆవేశంలో సుందర్ ప్రమోద్ అనే యువకుడు ఓ యువతిపై పెట్రోల్ పోసిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో చోటు చేసుకుంది. ఈ వ్యవహారం అంతా గమనించిన స్థానికులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. హుజూర్నగర్ ఎస్ఐ జి.ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి గత మూడు నెలల నుంచి హుజూర్నగర్ పట్టణంలోని తన మేనమామ ఇంటి వద్ద ఉంటోంది. యువతి ప్రస్తుతం కోదాడ రోడ్డు వైపు ఉన్న ఓ కార్యాలయంలో ఉద్యోగం చేస్తోంది.
గతంలో పరిచయం ఉన్న తన గ్రామనికే చెందిన సుందర్ ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి ఈనెల ఫిబ్రవరి 10వ తేదీన మధ్యాహ్నం సమయంలో బాధితురాలికి ఫోన్ చేశాడు. నీతో మాట్లాడాలి మీ ఆఫీస్ నుంచి బయట రమ్మని కోరగా ఆమె వచ్చింది. తనను ఎందుకు ప్రేమించడం లేదని ఆమెతో గొడవపడి తన వెంట తెచ్చుకున్న బాటిల్లోని ఉన్న పెట్రోల్ను ఒక్కసారిగా ఆమెపై పోసి హత్యకు ప్రయత్నించాడు. దీనిపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ ముత్తయ్య తెలిపారు.