Tuesday, April 8, 2025

నిమ్స్‌లో యువకుడికి విజయవంతంగా గుండె మార్పిడి

- Advertisement -
- Advertisement -

తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్న నగరానికి చెందిన 19 ఏళ్ల యువకుడికి నిమ్స్ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన మరో యువకుడి గుండెను యువకుడికి విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్ బాబు నేతృత్వంలోని డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ టెక్నీషియన్ల బృందం శుక్రవారం శస్త్రచికిత్సను పూర్తి చేసింది. నగరంలోని కాటేదాన్‌కు చెందిన పూజారి అనిల్‌కుమార్ కొంత కాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. నిమ్స్ హాస్పిటల్‌లో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన 24 ఏళ్ల యువకుడు నగరంలోని ఓ కార్పోరేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం బ్రెయిన్‌డెడ్ అయ్యారు.

అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఆ యువకుని బ్లడ్ గ్రూపునకు, అనిల్‌కుమార్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావడంతో ఆయన గుండెను నిమ్స్ ఆసుపత్రికి తరలించి, డాక్టర్ అమరేశ్ బాబు నేతృత్వంలోని బృందం అనిల్‌కుమార్‌కు విజయవంతంగా అమర్చింది. ఆరోగ్యశ్రీ కింద అనిల్‌కుమార్‌కు ఉచితంగా అవయవమార్పిడి చికిత్స చేశామని, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప వివరించారు. నిమ్స్‌లో గతేడాది 62 మందికి కిడ్నీ, నలుగురికి లివర్, ఇద్దరికి హార్ట్, ఒకరికి లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేశామని, ఈ ఏడాది 16 మందికి కిడ్నీ, ఒకిరికి లివర్, ఒకరికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేశామన్నారు. 2024, 2025లో కలిపి మొత్తం 87 ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేసినట్లు డైరెక్టర్ తెలిపారు. గతేడాది నిమ్స్‌లో ఒక వ్యక్తికి హార్ట్, లంగ్ రెండూ ఒకేసారి ట్రాన్స్‌ప్లాంట్ చేశామని బీరప్ప తెలిపారు. దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్క నిమ్స్‌లో మాత్రమే ఒకేసారి హార్ట్, లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.

అవయవదానంపై అవగాహన కల్పించాలని డాక్టర్లకు మంత్రి సూచన
విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన నిమ్స్ వైద్యులు, సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. అవయవమార్పిడి శస్త్రచికిత్స తర్వాత కూడా పేషెంట్ల బాగోగులను పర్యవేక్షించాలని, వారికి అవసరమైన వైద్య సేవలను కొనసాగించాలని సూచించారు. నిమ్స్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను మరింత విస్తరించాలని, ఇందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. గాంధీ హాస్పిటల్‌లో త్వరలోనే అధునాతన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. యువకుడికి గుండెను దానం చేసిన డోనార్ కుటుంబ సభ్యులను మంత్రి అభినందించారు. కొడుకును పోగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉండి కూడా, అతని అవయవాలు దానం చేసి మరో నలుగురికి ప్రాణం పోశారని ప్రశంసించారు.

వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవదానానికి ముందుకు వచ్చి, ప్రాణదాతలుగా నిలవాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. మరొకరికి పునర్జన్మను ప్రసాదించే అవయవాలను మట్టిలో వృథాగా కలిసిపోనీయొద్దని అన్నారు. అవయవదానం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జీవన్‌దాన్ ఇంచార్జ్, డాక్టర్ భూషణ్ రాజు మంత్రి సూచించారు. అవయవ మార్పిడి విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు హాస్పిటళ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవయవదానానికి సంబంధించిన కొత్త నిబంధనలను అమలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. అవయవాల అక్రమ రవాణా, సేకరణ, మార్పిడికి కఠిన శిక్షలు పడేలా కొత్త నిబంధనలు ఉండబోతున్నాయని మంత్రి దామోదర రాజనరసింహా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News