Sunday, October 27, 2024

జగన్ రాసిచ్చిన స్ర్కిప్ట్ చదువలేదని విజయసాయిరెడ్డి ప్రమాణం చేయగలరా?: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ సిఎం జగన్ రాసిచ్చిన స్ర్కిప్ట్ చదువలేదని వైసిపి నేత విజయసాయిరెడ్డి ప్రమాణం చేయగలరా? అని ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. షర్మిలది ఆస్తి తగాదా కాదు అని విజయ సాయిరెడ్డి చేసిన కామెంట్లపై ఆమె రీకౌంటర్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో రాజకీయంగా, ఆర్థికంగా బలపడిన వాళ్లు తనపై కామెంట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయసాయి రెడ్డి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వాళ్లలో ఒకరు అని, ఆయన ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారని చురకలంటించారు.

ఆస్తుల్లో నలుగురు బిడ్డలకు సమాన వాటా అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ మ్యాండేట్ అని, వైఎస్‌ఆర్ మ్యాండేట్ అబద్ధమని జగన్ ఆయన బిడ్డలపై ప్రమాణం చేయగలరా? అని షర్మిల సవాల్ విసిరారు. వైఎస్‌ఆర్ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదు అని, కాంగ్రెస్‌ను రెండు సార్లు వైఎస్‌ఆర్ అధికారంలోకి తీసుకొచ్చారని, బంగారు బాతును ఎవరూ చంపుకోరని, సొంత కళ్లను ఎవరూ పొడుచుకోరని ఆమె తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ తన బిడ్డ పెళ్లికి చంద్రబాబును పిలిచారని, అలాగే తాను కూడా పిలిచానని, ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే తన చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే జగన్ లాంటి వాళ్ళకు సభ్యతా సంస్కారం లేదన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ఇంకా చంద్రబాబు పిచ్చి పోలేదని, ఇప్పటికీ అద్దంలో చూసుకున్న చంద్రబాబే కనిపిస్తున్నట్లుందని షర్మిల ఎద్దేవా చేశారు. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడటానికో.. ఆయన బ్రాండింగ్ ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో పని చేయాల్సిన అవసరం తనకు లేదని, వైఎస్ఆర్ బిడ్డగా ఎన్నటికీ రాదని మాట ఇస్తున్నానని తెలియజేశారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News